మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించేందుకు “క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ” కీలకంగా ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రూపొందించిన క్యాన్సర్పై సమగ్ర నివేదికను జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలపై ఈ నివేదికలోని డేటా ఆధారంగా ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్కే పరిమితం కాకుండా, క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణకు ముందస్తు గుర్తింపు, అవగాహన, వైద్య సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
