మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించి గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారు, శారీరక వైకల్యానికి గురైన వారు, కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన ఉద్యమకారుల సేవలను గుర్తించాలనే దీర్ఘకాల డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు చైర్మన్గా వ్యవహరించనుండగా, సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ–విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు స్పష్టమైన ప్రమాణాలు రూపొందించడం కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేసి, వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది.అవసరమైతే అధికారులు, సంబంధిత వ్యక్తులను కమిటీ పిలిపించుకుని సమాచారం సేకరించవచ్చు. సమావేశాలు నిర్వహించి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీ పనులకు అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
