హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ ఇంధన ధరలు పెంచడం సామాన్యులపై భారమని మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని సీఎం పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” కేవలం ఎన్నికల నినాదంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పి, ఫలితాల తర్వాత పెంపు చేయడం ప్రజలను మోసం చేయడమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
