మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6 ప్రత్యేకంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు, హెల్ప్లైన్ 1950, అలాగే “బుక్ ఏ కాల్ విత్ BLO” సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు.ఎన్యుమరేషన్ దశలో అదనపు పత్రాలు అవసరం లేకుండా కేవలం ఫారం ఆధారంగా వివరాలు సేకరిస్తారని సీఈవో తెలిపారు. ఫారం అందించిన వారి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చుతారని, ఫారం ఇవ్వని వారి వివరాలు బూత్ వారీగా ప్రదర్శిస్తామని చెప్పారు.పుట్టిన తేదీ ఆధారంగా పత్రాల నిబంధనలు వర్తిస్తాయని, 1987 జూలై 1కి ముందు జన్మించిన వారికి ఒక పత్రం సరిపోతుందని తెలిపారు. 1987–2004 మధ్య జన్మించిన వారికి తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరి కాగా, 2004 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.రాష్ట్రంలో మొత్తం 3.45 కోట్ల ఓటర్లు, 35 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితా విడుదల తర్వాత అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందిస్తామని వివరించారు.
SIR షెడ్యూల్:
- జూన్ 25 – జూలై 24: ఇంటింటి సర్వే
- జూలై 31: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
- జూలై 31 – ఆగస్టు 30: అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబర్ 1: తుది ఓటర్ల జాబితా విడుదల
