మే 16, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గ్రామాలు, వార్డులు, సచివాలయాల స్థాయిలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు.మచిలీపట్నం రైతు బజార్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా సేవలు కొనసాగిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆర్టీసీపై ఇప్పటికే ఒత్తిడి పెరిగిందని, అయితే ప్రయాణికులపై ఛార్జీల పెంపు ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు సేవల నాణ్యత కూడా మెరుగవుతుందని కొనకళ్ల నారాయణరావు తెలిపారు.
