మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో 15 రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో సైబర్ నేరగాళ్లకు అక్రమంగా సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించారు.ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన 10 మంది ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 30 మందికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నకిలీ పత్రాలు, ఫేక్ ఐడీలతో సిమ్ కార్డులు తీసుకుని సైబర్ మోసాలకు వినియోగిస్తున్న నెట్వర్క్పై పోలీసులు దృష్టి సారించారు.సైబర్ నేరాల మూలాలను పూర్తిగా అరికట్టే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రజలు అపరిచితులకు తమ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంక్ సమాచారం ఇవ్వొద్దని హెచ్చరించారు.
