మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.స్త్రీనిధి సంస్థ మహిళల కోసం ఏర్పాటు చేసిన అసలైన మహిళా బ్యాంక్లాంటిదని మంత్రి అభివర్ణించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలకు అండగా నిలవడానికే ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం గొప్ప విజయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమేనని మంత్రి వెల్లడించారు. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అన్న నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ మహిళలు ఆర్థికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు.స్త్రీనిధిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఉద్యోగులు కలిసి తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
