మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసు నేపథ్యంలో తన కుమారుడు బండి భగీరథ్ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. చట్టం, న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.ఫిర్యాదు వచ్చిన వెంటనే కుమారుడిని పోలీసులకు అప్పగించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, న్యాయ సలహాల మేరకు కొంత సమయం తీసుకున్నామని చెప్పారు. ఆధారాలను పరిశీలించిన న్యాయవాదులు కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిపినప్పటికీ, మరింత జాప్యం సరికాదని భావించి విచారణకు పంపించినట్లు వివరించారు.చట్టం ముందు తన కుటుంబ సభ్యులైనా, సాధారణ పౌరులైనా సమానమేనని తాను ఎప్పుడూ విశ్వసిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, నిజం బయటకు వస్తుందనే విశ్వాసం ఉందని తెలిపారు.కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, విచారణలో పారదర్శకత కోసం ముందుగానే పోలీసులకు సహకరించామని ఆయన పేర్కొన్నారు. సత్యమే చివరికి విజయం సాధిస్తుందని బండి సంజయ్ అన్నారు.
