మే 17, (నేటి తెలుగు పత్రిక): తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని విక్రమ్గఢ్ ఆలోట్ – లూనీరిచ్ఛా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక బోగీలో మంటలు ప్రారంభమై వేగంగా మరో బోగీకి వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రభావిత రెండు బోగీలను మిగతా రైలు నుంచి వేరుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు వెల్లడించారు.అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొన్ని రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని రైల్వే శాఖ తెలిపింది.
