మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొత్త పెన్షన్ల అమలుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోడి రెక్క శౌరి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లలో తమ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు సకాలంలో ఇళ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వీటి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల భద్రత కోసం ఫ్యాక్టరీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఫార్మా రంగంలో ప్రమాదాల నివారణకు కొత్త విధివిధానాలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
