మే 17, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. షైతన్, మంగీలాల్ అనే ఇద్దరు నిందితుల నుంచి సుమారు 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను విజయవాడ వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. డ్రగ్స్ను ఎక్కడి నుంచి తెచ్చారు?, ఇంకా ఎవరెవరికి సరఫరా చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్న అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్రగ్స్ విక్రయాలు లేదా రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
