మే 17, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులను నిలదీశారు.ఆదివారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు మున్సిపల్ వాటర్ వర్క్స్ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. తాగునీటి చెరువుల్లో ప్రస్తుతం ఎంత నీరు ఉందో, ఆ నిల్వలు ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరాకు సరిపోతాయో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన బోరు బావుల తవ్వకాలు చేపట్టాలని స్పష్టం చేశారు.మంచినీటి చెరువు వద్దే ఉండి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించాలని వాటర్ వర్క్స్ సిబ్బందికి మంత్రి సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
