మే 17, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో తెలంగాణ ఎప్సెట్ 2026 ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్ విభాగంలో ఉప్పల్కు చెందిన ఎం. రుషి రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ను మూసాపేట్కు చెందిన అన్షుల్ దక్కించుకోగా, మూడో ర్యాంక్ను పులివెందులకు చెందిన ఎం. వంశీధర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన జె. రోషన్ మణిదీప్ రెడ్డి నాలుగో ర్యాంక్, మహబూబ్నగర్కు చెందిన ఎ. సాయినిఖిత్ ఐదో ర్యాంక్ సాధించారు.టాప్ ర్యాంకర్ల జాబితాను ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రానా విడుదల చేయగా, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగాలకు సంబంధించిన టాప్ 10 ర్యాంకర్ల వివరాలను టెక్నికల్ కమిషనర్ దేవసేన ప్రకటించారు.ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ప్రముఖ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్నారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో టాప్ ర్యాంకర్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
