మే 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ స్థాపించి ఉంటే కచ్చితంగా విజయం సాధించేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్న రజనీకాంత్.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ విజయం తనకు ఆనందంగా ఉందన్నారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు.అలాగే ఇటీవల మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలిసిన విషయంపైనా స్పందించారు. ఆ భేటీ పూర్తిగా స్నేహపూర్వకమని, దానిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.ఇక ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతానంటూ చమత్కరించారు. విజయ్ను తనకు సమవుజ్జీగా భావించడం లేదని, అన్ని పార్టీల్లోనూ తన అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు.గతంలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్.. ఆరోగ్య కారణాలతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాజకీయాలకు దూరంగానే ఉంటానని ప్రకటించడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
