మే 17, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై భార్య పుష్పవతి తలపై బండరాయితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది.ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడు సాంబయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.పోలీసులు నిందితుడు సాంబయ్యను అదుపులోకి తీసుకుని ఉయ్యూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయని, దీంతో వారు వేర్వేరుగా నివసిస్తున్నారని పుష్పవతి బంధువులు పోలీసులకు వివరించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ దాడిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
