మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. భగీరథ్ ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల పరిధిలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.హైదరాబాద్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్రెడ్డి.. ఈ కేసులో చట్ట ప్రక్రియ ప్రకారమే విచారణ సాగుతుందని తెలిపారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వతంత్ర అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు. “ఎలాంటి విచారణైనా రాష్ట్ర పోలీసులు స్వేచ్ఛగా నిర్వహించవచ్చు” అని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవిలో కొనసాగుతారా లేదా అనే అంశంపై తాను స్పందించలేనని చెప్పారు. అది పార్టీ, ప్రభుత్వ పరిధిలోని విషయం అని తెలిపారు.ఈ సందర్భంగా గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను కూడా కిషన్రెడ్డి ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనల సమయంలో అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు ఉదాహరణగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాల ప్రకారం పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు.బండి భగీరథ్ కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
