హైదరాబాద్, మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సంజయ్ పదవిలో కొనసాగకూడదని ఆయన అన్నారు.ఎల్బీనగర్లో నిర్వహించిన “నా బూత్ – నా భవిష్యత్తు” కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. “బేటీ బచావో” నినాదం కేవలం మాటల్లోనే కాకుండా చర్యల్లో కూడా కనిపించాలన్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసు జారీ అయ్యే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.తప్పు చేసిన కొడుకుని తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టారని బండి సంజయ్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా కొనసాగడం తెలంగాణకే కాదు దేశానికే అవమానకరమన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని, బాధిత కుటుంబంపై ఒత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు.ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, సీఎం రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ కలిసి మీడియాపై ప్రభావం చూపించారని కేటీఆర్ ఆరోపించారు. బాధితురాలి కుటుంబం ధైర్యంగా నిలబడిందని, బీఆర్ఎస్ మహిళా విభాగం మరియు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోరాటం చేశారని పేర్కొన్నారు.బండి భగీరథ్ లొంగిపోయాడని, అరెస్టు నాటకం ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బాధితులకు న్యాయం జరగాలంటే కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
