మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి కేంద్రంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పకుండా ట్వీట్లతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తుండటాన్ని కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు.పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులపై విషప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుపై గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు అక్కడి అభివృద్ధిని చూసి మౌనం వహిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమిదేనని పేర్కొన్నారు.అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది పేదలకు ఆహారం అందించామని గుర్తుచేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలు కూడా పూడ్చలేని వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
