మే 18, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాకు హామీ ఇచ్చిన అభివృద్ధి పనులను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన అరవింద్.. అవుటర్ రింగ్ రోడ్ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా బలహీనపర్చేందుకే జిల్లాపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. “ఇందూరు ప్రజలను మోసం చేస్తే వారే సమాధానం చెబుతారు” అని వ్యాఖ్యానించారు.నగరంలోని అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇప్పటికీ 25 శాతం కూడా పూర్తి కాలేదని అరవింద్ అన్నారు. రూ.162 కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.10 కోట్లు మాత్రమే విడుదల చేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తుచేసిన అరవింద్.. “అంటే మరో పదేళ్లు దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుందని కాంగ్రెస్నే ఒప్పుకున్నట్టే” అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నిజాయితీ గల నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్, ఫ్యూచర్ సిటీ వంటి అంశాలపై సీఎం రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ విమర్శించారు.
