Breaking News

గ్యాస్ లీక్‌తో ఘోర పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పలువురితో పాటు మొత్తం 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం.. సంతోష్ లోధి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ పైపు నుంచి లీకేజీ జరిగింది. గ్యాస్ ఇంటంతా వ్యాపించిన కొద్దిసేపటికే మంట తగలడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు దెబ్బతినగా, లోపల ఉన్న కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు.బాధితుల అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలకు దిగారు. వారిని కాపాడేందుకు ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు యువకులు కూడా మంటలకు గురై గాయపడ్డారు. దీంతో గాయపడిన వారి సంఖ్య 9కి చేరింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌కు పంపించారు. ప్రాథమిక విచారణలో గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ భద్రత, సిలిండర్ పరిస్థితిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన నేపథ్యంలో గ్యాస్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్యాస్ వాసన వచ్చిన వెంటనే మంటలు వెలిగించకూడదని, విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయరాదని, తలుపులు-కిటికీలు తెరిచి గాలి ప్రసరణ కల్పించాలని హెచ్చరించారు.

భగీరథ్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించిన పోలీసులు

సినిమాటోగ్రఫీ శాఖపై విశాల్ అసంతృప్తి.. సీఎం విజయ్‌కే బాధ్యతలు ఇవ్వాలంటూ సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *