మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు బహిరంగ లేఖ రాశారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇటీవల గోవులతో వెళ్తున్న ఓ లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనను ప్రస్తావించిన రాజాసింగ్.. అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని లారీని తీసుకెళ్లడం సరైన విధానం కాదని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా పోలీసులు విధులు నిర్వర్తించాలని సూచించారు.హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే భావన ప్రజల్లో కలగకూడదని రాజాసింగ్ పేర్కొన్నారు. గోమాత రక్షణ గురించి మాట్లాడే ప్రభుత్వం అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై డీజీపీ వెంటనే స్పందించి స్పష్టమైన చర్యలు చేపట్టాలని రాజాసింగ్ తన లేఖలో కోరారు.
