మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో కోతలు విధించవద్దని డిమాండ్ చేశారు.ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మరణిస్తున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వరి, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలను సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.గ్రేడ్-ఏ వరిని గ్రేడ్లెస్గా నమోదు చేస్తున్నారని, సన్నబియ్యానికి ఇచ్చే బోనస్ను తప్పించుకునేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. యూరియా సరఫరాలో కూడా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ రైతులకు అర్థం కావడం లేదని అన్నారు.వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడం లేదని, జిల్లాల్లో కలెక్టర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని కవిత ఆరోపించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సచివాలయం వద్ద వడ్లు పోసి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







