మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో నిర్వహించిన ‘రెన్జి 2026’ సదస్సులో పాల్గొన్న కిషన్రెడ్డి.. క్లీన్ ఎనర్జీ, స్టార్టప్లు, ఇంధన విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు 70 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.దేశంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఎక్కడా కొరత లేకుండా సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్పై ఆధారాన్ని తగ్గిస్తూ గ్రీన్ ఎనర్జీ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. హైదరాబాద్ను పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన కిషన్రెడ్డి.. ప్రతి పౌరుడు విద్యుత్ వినియోగదారుడిగానే కాకుండా ఇంధన ఉత్పత్తిదారుడిగా మారాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.
