మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. విశ్వవిద్యాలయంలోని పలు పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలను సందర్శించిన మంత్రి ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్నారు. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పురుగుమందుల పిచికారీ వంటి పనులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన మంత్రి.. ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలు కేవలం అధ్యయనాలకే పరిమితం కాకుండా రైతులకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అన్నారు.సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరికరాలను అనుసంధానం చేసినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతు సంక్షేమం సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
