విజయవాడ, మే 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో స్వచ్ఛత సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత లక్ష్యం’ నినాదంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినట్లు చెప్పారు.విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు నాలుగు దశల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి వారం రోడ్లు, ప్రజా ప్రదేశాల శుభ్రతపై దృష్టి సారిస్తామని, రెండో వారం కాలువల శుభ్రత చేపడతామని తెలిపారు.మూడో వారం ఇళ్లు, వాణిజ్య సంస్థల్లో చెత్త వర్గీకరణపై అవగాహన కల్పిస్తామని, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.ప్రజల భాగస్వామ్యం లేకుండా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్ర సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందని తెలిపారు.గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, చెత్త నిర్వహణలో పెద్ద లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యర్థాల శుద్ధి, ఎనర్జీ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమంలో చురుకుగా పాల్గొని స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
