మే 26, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు కీలక మార్గాలను గుర్తించినట్లు వెల్లడించారు.పరారీలో ఉన్న అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి తాత్కాలిక ఉపశమనం పొందిన తర్వాత, కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో రాకేశ్ వర్మ కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. గత డిసెంబర్లో ముంబైకి చెందిన వ్యక్తి నుంచి కొకైన్ కొనుగోలు చేసి, అనంతరం కౌశిక్ రవికి అందించినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇంటీరియర్ పనుల ద్వారా అభిషేక్ సింగ్తో పరిచయం ఏర్పడిందని, ఫాంహౌస్ పార్టీకి ముందు డ్రగ్స్ పార్సిల్ అందజేసినట్లు కూడా రాకేశ్ వర్మ వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న క్లింటన్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో గన్షాట్ ఘటన కూడా కీలకంగా మారింది. నమిత్ శర్మ చేతులకు గన్పౌడర్ ఆనవాళ్లు లభించడంతో పార్టీ సమయంలో కాల్పులు జరిగినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం బెయిల్పై విడుదలైన నిందితుల పాత్ర, డ్రగ్స్ నెట్వర్క్, పార్టీ నిర్వహణపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
