మే 26, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు రూరల్లో ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తూ “నన్ను ప్రశ్నించండి” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారులని, ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే పూర్తి హక్కు ఉందని పేర్కొన్నారు.యువతలో ప్రశ్నించే తత్వం పెరగాలని తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర, దేశ స్థాయిలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఆ అంశంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు.నెల్లూరు రూరల్లో అభివృద్ధి జరగని ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పినట్లు కోటంరెడ్డి తెలిపారు. “నన్ను ప్రశ్నించండి” కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిన ముగ్గురికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువత శ్రీశ్రీ, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.డీలిమిటేషన్ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పార్టీ అధిష్ఠానం నిర్ణయమని అన్నారు. తమ కుటుంబ అభిప్రాయం ప్రకారం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పోటీలో ఉండొచ్చని, అయితే నియోజకవర్గం తమ సొంతం కాదని, పార్టీ ఎవరిని ఎంపిక చేసినా స్వాగతిస్తామని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
