మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం, సమాజం రెండూ బలపడతాయని ఆమె అన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్లో “సఖి నివాస్” వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క.. మహిళల ఉన్నతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.సఖి నివాస్లో 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని, చిన్నపిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళల భద్రత, గౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.జూన్ 5న సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేస్తారని, మహిళా సంఘాల ఆధ్వర్యంలోని సోలార్ ప్లాంట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని కూడా పెంచుతున్నామని చెప్పారు.
