మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. మజ్లిస్ ఒత్తిడితో జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించారని ధ్వజమెత్తారు.హైదరాబాద్లో డివిజన్ల పునర్విభజనపై అధికారులకే స్పష్టత లేదని, నగర ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ, నగర మౌలిక వసతుల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ పేరిట అవినీతి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. చిన్న వానకే హైదరాబాద్ మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన రామచందర్రావు.. బీజేపీ మాత్రమే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దగలదని వ్యాఖ్యానించారు.
