మే 26, (నేటి తెలుగు పత్రిక): డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచనున్నారనే ప్రచారంపై సంస్థ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం బస్సు టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత ఛార్జీలే కొనసాగుతాయని తెలిపారు.డీజిల్ ధరలు పెరగడంతో సంస్థపై భారీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, వెంటనే ప్రయాణికులపై భారం మోపే నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితులను బట్టి మాత్రమే ఛార్జీల సవరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రస్తుతం ఒక్క రూపాయి డీజిల్ ధర పెరిగినా ఆర్టీసీపై నెలకు రూ.1.28 కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రూ.6 పెరగడంతో నెలకు సుమారు రూ.7.68 కోట్ల అదనపు వ్యయం వస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల బస్సులు నడుస్తుండగా, సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని వివరించారు.డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై ఒత్తిడి పెరిగినా, ప్రస్తుతం ఛార్జీల పెంపు లేకపోవడం ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
