మే 26, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపై నిలిపివేయగా, వెనుక నుంచి వచ్చిన వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు లారీలు, ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి.డీసీఎం లారీ ముందున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. అనంతరం కొబ్బరి బొండాలు తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలో బోల్తాపడింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ కార్లను ఢీకొట్టడంతో ఏడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.లారీని రోడ్డుపక్కకు తీసి మరమ్మతులు చేసి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
