మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా ప్రాథమిక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో సమీక్ష జరిగింది. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతులకు విత్తనాల సరఫరా, పంటల ప్రణాళిక వంటి అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, మార్కెటింగ్ సౌకర్యాలు విస్తరించడం, ఎగుమతుల అవకాశాలను పెంచడం వంటి అంశాలపై కూడా చర్చించారు.రైతుల ఆదాయం పెరిగేలా సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
