మే 27, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ పాలిటిక్స్కు నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని పేర్కొన్నారు. ఈసారి మహానాడును 1875 క్లస్టర్ల ద్వారా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ప్రజలకు పరిచయం చేసింది టీడీపీనేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, యువత అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.వైసీపీ పాలనలో దాడులు, అక్రమ కేసులు ఎదురైనా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
