మే 28, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యక్తిగత వివరాలను బయట సంస్థలకు అందిస్తే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. మొబైల్ నంబర్లు, చిరునామాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తే సహించబోమని స్పష్టం చేసింది. డేటా గోప్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని పేర్కొంటూ, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.ఇటీవల విద్యార్థుల డేటా దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ కీలక హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
