మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులు అర్పించారు. గొల్లపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన రాజకీయాల్లో కూడా ధ్రువతారగా వెలిగారని అన్నారు.కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరుదైన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆయన ఆద్యుడని, అణగారిన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు.తెలుగు దేశం పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయకత్వం పార్టీని నిలబెట్టిందని దేవినేని ఉమ అన్నారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. అసత్య ప్రచారాలతో వచ్చిన వైసీపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు.
