మే 28, (నేటి తెలుగు పత్రిక): రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో నిర్వహించిన “రైతు గోడు – భారతీయ జనతా పార్టీ భరోసా యాత్ర”లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్దూర్ తండాలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామని చెబుతోందని, అయితే కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయని ప్రశ్నించారు. రైతులు పంటలను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నెల రోజులైనా ప్రభుత్వం 40 శాతం ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనలేదని ఆరోపించారు. అకాల వర్షాల భయంతో రైతులు కల్లాల వద్దే కాపలా కాస్తున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, ధాన్యం తరలింపు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని మహేశ్వర్ రెడ్డి కోరారు.
