మే 28, (నేటి తెలుగు పత్రిక): బక్రీద్ పండుగ సందర్భంగా నల్గొండలో ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లాపై విశ్వాసం, త్యాగస్ఫూర్తిని చాటిచెప్పే పవిత్ర పండుగగా బక్రీద్ను అభివర్ణించారు. మునుగోడు రోడ్డులోని ఈద్గాలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బక్రీద్ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా మానవత్వం, సహనం, సోదరభావాన్ని తెలియజేసే గొప్ప సందేశమని అన్నారు. దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పనిచేస్తోందని తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని గుర్తుచేశారు.నల్గొండ జిల్లా మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో జీవించడం గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
