హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని కోరారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం ప్రతిపాదితమైంది. మొదట 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించాలని భావించగా, 2016లో జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.అయితే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తాజాగా పునఃసమీక్షించింది. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ సరిపోదని నిపుణులు సూచించడంతో బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి చర్చ అవసరమని సీఎం రేవంత్రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజ్ ఎత్తు పెంపు కీలకమని తెలిపారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్ఆర్ఎల్ పరిశీలించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని సీఎం లేఖలో స్పష్టం చేశారు.
