అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నీటిపారుదల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన మహానాడులో “నీటిపారుదల అభివృద్ధి – నదుల అనుసంధానం” అంశంపై ఆయన ప్రసంగించారు.జలం ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందుతుందని, ఈ సత్యాన్ని గుర్తించిన ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు మహానగరాలుగా మారడానికి నీటి వనరులే కారణమని చెప్పారు.రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చరిత్రను తెలుగుదేశం పార్టీకి ముందు, తర్వాతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసి రూ.18 వేల కోట్ల అప్పులు మిగిల్చారని ఆరోపించారు.రాయలసీమ జీవనాడిగా పేరుగాంచిన హంద్రీనీవా ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా మొదటి దశను పూర్తి చేసి 727 కిలోమీటర్ల దూరం వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2024లో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకుని గేటును పునర్నిర్మించి 80 టీఎంసీల నీటిని వృథా కాకుండా కాపాడారని చెప్పారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్, అదే రాయలసీమకు ఎందుకు నష్టం చేశారో సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
