మే 28, (నేటి తెలుగు పత్రిక): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈసారి పంట దిగుబడి అధికంగా వచ్చిందని, జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని వెల్లడించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు.హామాలీల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సింగరేణి నుంచి 40 లారీలు, గనుల శాఖ నుంచి మరో 40 లారీలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 80 లారీలతో ధాన్యం రవాణా వేగవంతం చేస్తామని మంత్రి వివరించారు.
