Breaking News

మహానాడులో మరో రికార్డు నమోదైంది: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మరో సంచలన రికార్డు సృష్టించిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి మహానాడుకు 11 లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరై తమ హాజరును అధికారికంగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు.మహానాడులో గురువారం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన లోకేశ్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకత్వాన్ని ఇప్పటి నుంచే తయారు చేస్తామని అన్నారు. పార్టీలో నిరంతరం సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచే తెలుగుదేశం పార్టీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేశారు.పదవీకాల పరిమితి విధానాన్ని తీసుకొచ్చింది కూడా తమ పార్టీనేనని తెలిపారు. ఎన్నికల కోసమే కాదు, సిద్ధాంతపరమైన మార్పుల కోసమే సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు.గత మహానాడులో తాను ఆరు శాసనాల గురించి మాట్లాడానని గుర్తుచేసిన లోకేశ్, ఈసారి “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రసంగానికి ముందు ఈ నినాదాన్ని తప్పనిసరిగా చెప్పాలని స్పష్టం చేశారు.నేటి యువత ఏమి ఆశిస్తున్నారో అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.స్థానిక ఎన్నికల్లో గతంలో నామినేషన్ పత్రాలు లాక్కోవడం వంటి ఘటనలు ప్రజలు చూశారని, తాము అలాంటి ఏకపక్ష రాజకీయాలు చేయమని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.డీఎస్సీ పరీక్షలు పూర్తై నెలలు గడిచిన తర్వాత అక్రమాల ఆరోపణలు చేయడం విడ్డూరమని జగన్‌పై విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే కోర్టుల్లో పలు కేసులు వేసినా, అన్ని పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయని తెలిపారు. ఒక్క ఉపాధ్యాయుడు గానీ, అధికారి గానీ డీఎస్సీపై ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.డీఎస్సీ నియామకాల విషయంలో తాను లేదా అధికారులకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్ స్పందించి బహిరంగ చర్చకు రావాలని లోకేశ్ మరోసారి సవాల్ చేశారు.జగన్ కుటుంబ చరిత్ర, గత ఘటనల గురించి ప్రజలకు తెలిసేలా చేసింది కూడా జగన్ వైఖరేనని వ్యాఖ్యానించారు. తాను జగన్‌లా కాదని, తన వద్ద గొడ్డలి లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకం: పెమ్మసాని చంద్రశేఖర్

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *