కృష్ణా జిల్లా, మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము, ప్రస్తుతం కొడాలి నాని కార్పొరేటర్గా కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. గుడివాడ ప్రజలు భారీ ఓట్ల తేడాతో ఓడించినా ఇంకా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు.విజయవాడలో కూర్చొని వ్యాఖ్యలు చేయడం కాదని, దమ్ముంటే గుడివాడకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు సేవ చేయగలిగితే చేసి చూపించాలని అన్నారు.గుడివాడలో కొడాలి నాని రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రజలు ఆయనను చాలాకాలం క్రితమే మరిచిపోయారని వ్యాఖ్యానించారు. సమాజం తిరస్కరిస్తున్నా ఇంకా విమర్శలు చేయడం సరికాదన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి వేరు అని, వారిపై విమర్శలు చేసే ముందు రాజకీయ పరిజ్ఞానం ఉండాలని సూచించారు.అమరావతి విషయంలో మాట మార్చిన వ్యక్తి జగన్ అని, అలాంటి నాయకత్వాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు.కొంతమంది వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై కాకుండా సామాజిక మాధ్యమాల ప్రచారాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గుడివాడలో క్షేత్రస్థాయిలోకి వచ్చి రాజకీయంగా తేల్చుకుందామని కొడాలి నానికి ఎమ్మెల్యే రాము సవాల్ విసిరారు.
