అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరమని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మహానాడు వేదికగా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయంపై ఆయన వివరించారు.ప్రజల కలల రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. అమరావతికి చట్టబద్ధత తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అమరావతిని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ సంకల్పంతో రాజధాని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను రైతుల జీవితాల్లోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. 2014 నుంచి 2019 మధ్య పోలవరం పనులు 70 శాతం పూర్తయ్యాయని, గత ఐదేళ్లలో మాత్రం పురోగతి చాలా తక్కువగా జరిగిందని విమర్శించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కేంద్రం రూ.11,400 కోట్లు సహాయం చేసిందని తెలిపారు. ఆంధ్రుల సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.గ్రామీణాభివృద్ధిలో కూడా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని చెప్పారు. కేంద్ర పథకాల కింద నిలిచిపోయిన 82 పథకాలను పునరుద్ధరించామని, వాటికి రూ.12 వేల కోట్లు చెల్లించామని వివరించారు. అమృత్ పథకం కింద రెండు లక్షల కొత్త తాగునీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.రైల్వే రంగంలో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పారు. 316 రైల్వే వంతెనలు, 16 వందే భారత్ రైళ్లు, 73 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. అమరావతిలో రూ.2,500 కోట్లతో రైల్వే ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని వేగవంతం చేశామని, గత ప్రభుత్వ కాలంలో తక్కువ వ్యయం జరిగితే.. ప్రస్తుతం భారీగా నిధులు వెచ్చించి ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు.రాయలసీమలో ఉద్యానవన రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, గ్రీన్ హైడ్రోజన్ నుంచి సాంకేతిక రంగాల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
