మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు దేశానికి స్ఫూర్తిదాయక నాయకులని కొనియాడారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు ఎన్టీఆర్ ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు.తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. హైదరాబాద్లో భారీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ముప్పై వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక భవిష్యత్ నగర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించడమే కాకుండా తెలంగాణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అది ఎన్టీఆర్ అమలు చేసిన రెండు రూపాయల బియ్యం పథకం స్ఫూర్తితోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాగే మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆశయాలు, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రజాపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రజల సహకారంతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


