మే 29, (నేటి తెలుగు పత్రిక): అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో మధురమైన సంఘటన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎన్నో విమర్శలు ఎదురైనా తాము వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.ఎన్టీఆర్ ఎంతోమందికి రాజకీయంగా గుర్తింపు ఇచ్చారని, పలువురు నాయకుల రాజకీయ ప్రస్థానానికి ఆయనే కారణమయ్యారని పేర్కొన్నారు. ఆయన పేరు ఉపయోగించుకునే వారే ఇప్పుడు విగ్రహ ఏర్పాటుపై విమర్శలు చేయడం బాధాకరమని పరోక్షంగా ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు దేశానికి దిశానిర్దేశం చేసిన మహానాయకులని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి స్ఫూర్తితోనే ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు.
