మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని హరిత ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని చిన్నబీవరల్లిలో ఇంటిపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్యానెల్ను, గార్లపాడులో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సౌర పంపుసెట్ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంటిపైన ఏర్పాటు చేసే సౌర ప్యానెల్ల ద్వారా మిగిలిన విద్యుత్ను విద్యుత్ వ్యవస్థకు పంపించి ఆదాయం సంపాదించవచ్చన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సౌర ప్యానెల్లను షెడ్లుగా కూడా వినియోగించుకోవచ్చని వివరించారు.రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగినా ఎక్కడా కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల ధాన్యం, మొక్కజొన్నతో పాటు ఇతర పంటల దిగుబడులు పెరిగాయని చెప్పారు.ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని విమర్శించిన భట్టి, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. యాసంగి సీజన్లో లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరించామని వెల్లడించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.రైతులను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, అలాంటి వారిని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
