మే 29, (నేటి తెలుగు పత్రిక): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.యాసంగి సీజన్లో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, కేంద్రం మాత్రం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
