మే 29, (నేటి తెలుగు పత్రిక): పోలవరం అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, పులి కదలికలపై ఇరవై నాలుగు గంటలు నిఘా కొనసాగించాలని ఆదేశించారు.తిమ్మాపురం రిజర్వ్ అటవీ పరిధిలో పులి సంచరిస్తోందని అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల వైపు పులి కదులుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే ప్రత్యేక అటవీ బృందాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల పాకపై పులి దాడి చేయడంతో తొమ్మిది దూడలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అడవికి సమీపంలోని ఆయిల్ ఫామ్ తోటలో కూడా పశువులపై దాడి జరిగినట్లు తెలిపారు. పులి సంచారంపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. మనుషులు, పశువుల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అటవీ శాఖకు స్పష్టం చేశారు.పులి సంచరిస్తున్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలు అనవసరంగా అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించాలని అధికారులకు సూచించారు. పశువులను అడవి ప్రాంతాలకు సమీపంలో కట్టివేయవద్దని రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.బాధిత రైతులకు తక్షణ సాయం అందించామని, పూర్తి పరిహారం త్వరలో చెల్లిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
