మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19 వేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తొలి దశలో సుమారు 5 వేల కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది.ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించిన వెంటనే నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నియంత్రణ, ప్రత్యేక భద్రతా విభాగాల బలోపేతం కోసం ఈ నియామకాలను చేపట్టనున్నట్లు సమాచారం.ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ వంటి విభాగాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.అయితే ఇప్పటివరకు ఈ నియామకాలపై ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఉద్యోగార్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. నియామక ప్రకటన విడుదలైతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
