మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాల వ్యవస్థపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని పేర్కొంటూ, ప్రత్యేక హోదాలు, అధికార పదవుల ఆధారంగా వేర్వేరు దర్శన ఏర్పాట్లు ఎందుకు ఉండాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆలయానికి వెళ్లినా వారి కోసం దేవుడు వేచి ఉంటాడని భావించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.దర్శనాల విషయంలో సాధారణ భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తుండగా, కొందరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సమానత్వ సూత్రానికి విరుద్ధమా అనే అంశంపై కూడా కోర్టు దృష్టి సారించింది. ఆలయాల్లో భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సనాతన ధర్మం కులం, హోదా, ఆర్థిక స్థితి ఆధారంగా ఎలాంటి వివక్షను ప్రోత్సహించదని వాదించారు. దేవాలయాలు సమానత్వానికి ప్రతీకలుగా ఉండాలని, ప్రత్యేక దర్శనాల విధానం ఆ భావనకు విరుద్ధంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంచేయాలని హైకోర్టు సూచించింది. వీఐపీ దర్శనాల వ్యవస్థపై న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భక్త వర్గాలు, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
